తెలంగాణ సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసు చాటుకున్నారు: వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న ముందస్తు చర్యల వలన దేశంలోనే అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలిచిందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన ట్విటర్లో స్పందించారు.
‘గ్రామ వలంటీర్లకు పని విభజన చేసి ప్రతి వ్యక్తి హెల్త్ రికార్డును తయారు చేయడం అత్యంత క్లిష్టమైన కార్యక్రమం. దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలలో ఉన్న ఏపీ ప్రజలు ఏప్రిల్‌ 14 వరకు అక్కడే ఉండాలి. దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో జగన్ గారు మాట్లాడారు. అక్కడ వారికి ఏ కొరత రాకుండా చూసుకుంటామని హమీ ఇచ్చి కేసీఆర్ గారు పెద్ద మనసును చాటుకున్నారు. బయటి నుంచి పౌరులు వస్తే నియంత్రణ చర్యలు గతి తప్పే ప్రమాదం ఉంది.’ అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.