
హైదరాబాద్ సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ప్రతీరోజూ వెయ్యిమందికి పరీక్షలు చేసే సామర్థ్యం సీసీఎంబీలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి సీసీఎంబీలో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో… ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు అనుమతులను ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర మెడికల్ రీసెర్చ్ నుంచి సీసీఎంబీకి ఆదేశాలు జారీ అయ్యాయి. మంగళవారం నుంచి కరోనా టెస్టులు చేయడానికి సిద్ధమవుతోంది సీసీఎంబీ. గాంధీ ఆసుపత్రి నుంచి సీసీఎంబీకి శాంపిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రతి రోజూ 800 నుంచి 1000 కరోనా టెస్టులు నిర్వహించే సామర్థ్యంతో సీసీఎంబీ సిద్ధమైందని తెలుస్తోంది. దేశంలోనే అత్యంత పారదర్శకమైన పరిశోధనా సంస్థలో కరోనా పరీక్షలు జరిపితే.. తాత్కాలిక ఉపయోగంతోపాటు పరిశోధనల దిశగా దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనంగా వుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి నుంచి చెబుతున్నారు. ఇదే అంశాన్ని ఆయన ప్రధాన మంత్రికి వివరించడంతో.. ఆయన ఆదేశాల మేరకు కేంద్ర మెడికల్ రీసెర్చ్ సంస్థ సీసీఎంబీలో పరీక్షలకు, పరిశోధనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద.