రైస్ మిల్లర్లకు అండగా ప్రభుత్వం: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం, బియ్యం విధానం’రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ, అమ్మకం, ఎగుమతులు, దీనికి అవలంభించాల్సిన విధానం తదితర అంశాలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లర్లతోపాటు ఇతర భాగస్వాములందరితో చర్చలు జరిపి, విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉండి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేయనున్నట్లు ప్రకటించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని, అసెంబ్లీలో కూడా చర్చించి, విధానాన్ని ఆమోదిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ తదితర కారణాల వల్ల రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుండటంతో..రాష్ట్రంలో వరిసాగు పెరుగుతున్నది. ఈ సారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. కోటి టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఈ సారి వానాకాలంలో 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగే అవకాశం ఉంది. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశం ఉంది. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో రాదు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుంది.
తెలంగాణ ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తుంది. తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి, మిల్లుకు పంపి బియ్యం తయారు చేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పని. దీనికోసం ఇప్పుడున్న పద్ధతి పనికి రాదు. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మకం జరిగే వరకు అన్ని సజావుగా సాగాలంటే సమగ్ర ధాన్యం, బియ్యం విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణవ్యాప్తంగా 2200 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి టన్నుల బియ్యం తయారు చేయగలవని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాకుండా, ఎఫ్.సి.ఐ.కి పంపించడానికి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అనువుగా మిల్లులు పూర్తి సామర్థ్యంతో పని చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇంకా మరికొన్ని మిల్లులు రావాలి. దీనికోసం రైసుమిల్లులు బాగా నడవడానికి, అవి లాభాల్లో ఉండడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం చేస్తామని సీఎం హామీనిచ్చారు. తెలంగాణలోని రైస్ మిల్లులు రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
రైస్ మిల్లర్లకు అధికారుల వేధింపులుండవు..రైసు మిల్లర్లకు ఇకపై అధికారుల నుంచి వేధింపులుండవని సీఎం కేసీఆర్ స్పష్ం చేశారు. అనేక రకాల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా విధానంలో ప్రభుత్వం మార్పులు తెస్తుందని చెప్పారు. రైస్ మిల్లర్లకు సరైన మార్కెటింగ్ వ్యూహం ఉండాలని సీఎం నిర్దేశించారు. తెలంగాణ ప్రజలు ఏ రకం బియ్యం తింటారు? ఇతర రాష్ట్రాల వారు ఏ రకం బియ్యం తింటారు? అనే విషయాలను సరిగ్గా అంచనా వేసి, దానికి అనుగుణంగా ధాన్యం రకాలను పండించాలని సూచించారు. వాటిని ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి ఇటు రాష్ట్ర ప్రజలకు, అటు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పంపించాలన్నారు.
ప్రస్తుతం కరోనా ప్రభావంతో రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీలు తమ సొంత రాష్ట్రమైన బీహార్ కు వెళ్ళారు. మళ్లీ సీజన్ వచ్చింది కాబట్టి, ప్రత్యేక బస్సుల్లో వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో రైసు మిల్లుల స్థాపనకు పారిశ్రామిక వాడల్లో స్థలం కేటాయించే అవకాశాలను పరిశీలిస్తామని సీఎం తెలిపారు. రైసు మిల్లులను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గా గుర్తించి, అసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంప నాగేందర్, మోహన్ రెడ్డి, నాయకులు చంద్రపాల్, బొచ్చు భాస్కర్, ప్రభాకర్ రావు, తోట సంపత్ కుమార్, కాంతయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.