
లాక్డౌన్ వల్లే కరోనా వైరస్ను అదుపు చేయగలిగామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వైరస్తో చనిపోయిన వారంతా మర్కజ్ వెళ్లొచ్చిన వారేనని సీఎం పేర్కొన్నారు. ప్రగతి భవన్లో కరోనా ప్రభావం, లాక్డౌన్పై అత్యున్నత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ జబ్బు మన దేశంలో పుట్టింది కాదు. వేరే దేశంలో పుట్టిన జబ్బు ట్రాన్స్మిట్ అయింది. ఈ వైరస్ను అరికట్టేందుకు అన్నింటిని లాక్డౌన్ చేశారు. లాక్డౌన్ వల్ల మన దేశం, రాష్ట్రం అద్భుతమైన గణనీయమైన విజయం సాధించింది. ఈ విషయంలో సందేహం అవసరం లేదు అని సీఎం స్పష్టం చేశారు
దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,314. మరణించిన వారి సంఖ్య 122. చాలా సేఫ్గా దేశం ముందుకెళ్తుంది. ఇది తాను చెప్పడం లేదు. ఇండియా మంచి పని చేసింది అని ఇంటర్నేషల్ జర్నల్స్ ప్రకటించాయి. ఐక్యతను ప్రదర్శించి ఇండియా మంచి పని చేసిందని ఇతర దేశాల అధినేతలు ప్రశంసించారు. లాక్డౌన్ విధించకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్లం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం మనది. అమెరికా లాంటి దేశం భయంకరమైన పరిస్థితిలో ఉంది. న్యూయార్క్లో శవాల గుట్టలు ఉన్నాయి. అక్కడ బాధలు హృదయవిదారకంగా ఉన్నాయి అని సీఎం తెలిపారు. న్యూయార్క్లో శవాన్ని ముట్టుకునే వారు ఎవరూ లేరు. అంత పవర్ ఉన్నా దేశం అయినప్పటికీ కూడా దయనీయమైన స్థితిలో ఉంది. ఆ పరిస్థితి మనకు ఉంటే కోట్ల మంది చనిపోయేవారు.
మన రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో రెండు దశలను అమలు చేశాం. మొదటి దశలో విదేశాల నుంచి వచ్చిన వారు, వారి ద్వారా కొంతమందికి ట్రాన్స్మిట్ అయిందని సీఎం తెలిపారు. మొదటి దశలో మొత్తం 50 మందికి కరోనా సోకితే ఇందులో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారు. మిగతా 20 మంది వారి కుటుంబ సభ్యులేనని సీఎం పేర్కొన్నారు. మొదటి దశలో ఇప్పటి వరకు 25,937 మందిని క్వారంటైన్ చేసి ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టుకున్నామని సీఎం చెప్పారు. ఈ 50 మందిలో ఎవరూ చనిపోలేదు అని సీఎం స్పష్టం చేశారు. వీరిలో 35 మంది డిశ్చార్జి అయ్యారు. మిగతా వారు కూడా ఎల్లుండి లోపు డిశ్చార్జి అవుతారు. క్వారంటైన్లో ఉన్న వారిని కూడా 9వ తేదీ లోపు డిశ్చార్జి అవుతారు. సంతోషంగా వాళ్ల ఇండ్లకు పోతారు. ఇది మొదటి ఫేజ్ అని సీఎం తెలిపారు.
రెండో దశలో వచ్చిన కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చినవే అని సీఎం పేర్కొన్నారు. నిజాముద్దీన్ సంఘటన దేశాన్ని అతలాకుతలం చేసింది. మర్కజ్ కేసుల్లో భాగంగా పాతవి, కొత్తవి కలిపి.. 364 మందికి సోకింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 మంది కరోనాతో చనిపోయారు. వీరంతా మర్కజ్ వెళ్లొచ్చిన వారేనని సీఎం స్పష్టం చేశారు. గాంధీలో 308 మంది చికిత్సలో ఉన్నారు. మర్కజ్ నుంచి వచ్చిన 1089 మందిని గుర్తించాం. ఇంకో 30 మంది ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోందన్నారు సీఎం. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 173 మందికి కరోనా సోకగా.. వీరి నుంచి మరో 93 మందికి సోకింది. మర్కజ్ వారిని గుర్తించే పనిలో ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు పని చేస్తున్నారు. లాక్డౌన్లో భాగంగా ప్రజలు సహకరిస్తున్నారు. ఇంకా సహకరించాలి అని సీఎం కేసీఆర్ కోరారు.