ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌పై ఎమ్మెల్యే రజని ఆగ్రహం

‘మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీయాలని చూస్తారా?’ అంటూ ఎమ్మెల్యే విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ లంచాలు అడుగుతున్న ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ డి.రామ్‌ప్రసాద్‌ మాట్లాడిన కాల్‌ రికార్డింగులు ఎమ్మెల్యే దృష్టికి రావటంతో  ఆమె చిలకలూరిపేట ఎక్సైజ్‌ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులను ప్రశ్నించగా ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఆర్‌.వి.వి.ప్రసాద్‌ రికార్డింగ్‌లోని వాయిస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రామ్‌ప్రసాద్‌దని తెలపగా తనదేనని అతను కూడా అంగీకరించారు. ప్రభుత్వ స్ఫూర్తిని కాపాడాల్సిన వారే ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడటం తగదని హితవు పలికారు.  అనంతరం ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు హెడ్‌కానిస్టేబుల్‌ తీరుపై చర్యలు తీసుకోవాలని ఫోన్‌ చేసి చెప్పారు

ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌ 
అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో స్టాక్‌ దొంగిలించిన వారికి సహకరించిన కారణాలతో ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ ఎక్సైజ్‌ డీసీ (ఎఫ్‌ఏసీ) శ్రీనివాస్‌ మంగళవారం తెలిపారు. ఇటీవల నరసరావుపేటలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొందరు స్టాక్‌ను దొంగిలించారు. ఈవ్యవహారానికి సహకరించిన సత్యనారాయణ, చిలకలూరిపేటలో బెల్టుషాపుల నుంచి డబ్బు వసూలు చేస్తూ అవినీతి  ఆరోపణలు ఎదుర్కొంటున్న డి.రామ్‌ప్రసాద్‌పై నేరం నిర్ధారణ కావడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు.