ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ వి. కనగరాజ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయిన అనంతరం ఏపీ నూతన ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జిని నియమించాలని ఏపీ గవర్నమెంట్‌ నిన్న ఆర్డినెన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జస్టిస్‌ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ఏపీ ప్రభుత్వం నియమించింది. 

మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి కనగరాజ్‌ పదవీవిరమణ పొందారు. దాదాపు 9 సంవత్సరాల పాటు కనగరాజ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. విద్య, బాలలు, మహిళలు, వృద్ధుల సంక్షేమం అంశాలకు సంబంధించి పలు కీలక తీర్పులు ఇచ్చారు కనగరాజ్‌. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న కనగరాజ్‌.. 1997లో మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీవిరమణ పొందారు.