
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. భారత్లో కూడా కరోనా కేసుల పెరుగుదల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ లవ్ అగర్వాల్ హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన 24 గంటల్లో దేశంలో 796 కరోనా పాజిటివ్ కేసులు, 35 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 308కి చేరింది.
ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,152కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 857 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు తెలిపింది. కాగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2 లక్షల 6 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. టెస్టింగ్ కిట్లు కూడా మరో 6 వారాలకు సరిపోయేలా అందుబాటులో ఉన్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు.