మా కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా – కర్నూలు ఎంపీ డా. సంజీవ్‌కుమార్‌

తన కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు నర్సింగరావుపేటలో ఉన్న తన సోదరుల కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని, వీరంతా రాష్ట్ర కోవిడ్‌ హాస్పిటల్‌ (కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి)లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.  కాగా ఎంపీ తండ్రి, సోదరుడితో పాటు మరో నలుగురికి కరోనా సోకగా వీరంతా, క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్‌ ఆస్పత్రిలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. 

కర్నూలులో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయని మీడియాలో వస్తున్న వార్తల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అయితే దీని గురించి భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. అమెరికా, స్పెయిన్‌లో కరోనా మరణాలు ఎక్కువగా ఉండటాన్ని చూసి ఇక్కడి వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో బీసీజీ వ్యాక్సిన్‌ వాడుతుండటం వల్ల ఇక్కడి ప్రజలకు రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, అమెరికా లాంటి పరిస్థితి ఇక్కడ రాదని వివరించారు. లాక్‌ డౌన్‌ ఆంక్షలను రెడ్‌ జోన్లలో పొడిగించి.. గ్రీన్‌ జోన్లలో విడతల వారీగా ఎత్తివేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజ్‌భవన్‌కు చెందిన నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. చీఫ్‌ సెక్యూరిటీ అధికారితో పాటు నర్సింగ్‌ సిబ్బందికి కరోనా సోకింది