సిద్దిపేట జిల్లాలోని చందలాపూర్ రంగనాయక సాగర్ టన్నెల్ పంప్హౌస్, సంప్హౌస్ను గురువారం సాయంత్రం మంత్రి హరీశ్రావు పరిశీలించారు. రంగనాయక సాగర్ జలశయ బండ్ చుట్టూ కలియతిరిగారు. అనంతరం టన్నెల్లోని పంప్హౌస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో ఇరిగేషన్ ఎస్ఈ ఆనంద్, మెగా ప్రతినిధి ఉమామహేశ్వర రెడ్డి, ప్రజాప్రతినిధులు వేలేటి రాధాకృష్ణ, జాప శ్రీకాంత్రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. రంగనాయక సాగర్లో ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీ నీళ్లు చేరాయని, కుడి, ఎడమ కాల్వలకు నీళ్లు రావాలంటే ఇంకా ఎన్ని టీఎంసీల నీళ్లు రావాల్సి ఉందని అధికారులతో చర్చించారు. మరో రెండు రోజుల్లో ప్రధాన కుడి, ఎడమ కాల్వల ద్వారా నీళ్లు రానున్నాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మండలాల వారీగా ఏ ఏ గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగులు ముందుగా నిండనున్నాయనే అంశాలపై అధికారులతో మంత్రి సమీక్ష చేశారు.