యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ కరోనా కాలుమోపింది. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుండా గ్రీన్ జోన్లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం కొత్తగా నాలుగు కరోనా కేసులు బయటపడటం కలకలం రేపింది. ఆదివారం జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. ఆత్మకూరు (ఎం) మండలంలో మూడు పాజిటివ్ కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక కేసు నమోదైనట్టు కలెక్టర్ వెల్లడించారు. అయితే, వారంతా ముంబై నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారని తెలిపారు. జిల్లాల్లో నలుగురికి కరోనా పాజిటివ్గా తేలడంతో వారి ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించి క్వారెంటైన్కు తరలిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
