సూర్యాపేట జిల్లాలో 140మంది పోలీసుల బదిలీ

ఒకే స్టేషన్‌లో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న పోలీస్‌ సిబ్బందికి సూర్యాపేట ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ స్థాన చలనం కల్పించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 140మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వారు కోరుకున్న స్టేషన్‌కు బదిలీ చేశారు.
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లుగా సర్వీసు పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందిని సూర్యాపేట ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ సోమవారం బదిలీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్‌ఐ, హెచ్‌సీ, పీసీలకు ఒక్కొక్కరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వారు కోరుకున్న పోలీస్‌స్టేషన్‌కు బదిలీచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని, బదిలీపై వెళ్లే సిబ్బంది నూతన పోలీస్‌స్టేషన్‌లో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ గర్వంగా సేవలందించాలన్నారు. పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాంచందర్‌ మాట్లాడుతూ కోరుకున్న పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసిన ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ గీత, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, ఆర్‌ఐలు శ్రీనివాస్‌, నర్సింహారావు, ఎస్‌ఐ రామారావు, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.