తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రెండు మూడు రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఏకంగా 872 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో అత్యధికంగా 713 మంది గ్రేటర్వాసులు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్ జిల్లాలో 16, సంగారెడ్డి జిల్లాలో 12, వరంగల్ రూరల్ జిల్లాలో 6, మంచి ర్యాల జిల్లాలో 5, కామారెడ్డి, మెదక్ జిల్లాలో 3 చొప్పున, జనగామ, కరీంనగర్, మహబుబాబాద్ జిల్లాలో రెండు చొప్పున, వరంగల్ అర్బన్ జిల్లాలో ఒక కేసు నమోదైంది.
దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 8,674కి చేరింది. 4,452 మంది వివిధ ఆస్పత్రులు, హోంక్వారంటైన్లో చికిత్స పొందుతుండగా.. 4,005 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. సోమవారం ఏడుగురు మృతిచెందగా.. ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 217కి పెరిగింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 3,189 మందికి పరీక్షలు నిర్వహించగా.. 27.34 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 60,243 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.