ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రం శివారులోని గండి రామన్న ఆక్సిజన్ పార్కులో మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కాలుష్యబారిన పడకుండా హరితహారాన్ని చేపట్టామని వివరించారు. ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీశాఖ ద్వారా 60 అర్బన్ పార్కులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గండిరామన్న పార్కును 600 ఎకరాల్లో విస్తరించి మరింత అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.