తెలంగాణలో కొత్తగా మరో 1,879 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం 1,879 కరోనా కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,422 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. మంగళవారం ఒక్కరోజే 1,506 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్‌ మల్కాజిగిరి 94, కరీంనగర్‌ 32, నల్లగొండ 31, నిజామాబాద్‌ 19, వరంగల్‌ అర్బన్‌ 13, ములుగు, మెదక్‌ 12 చొప్పున, మహబూబ్‌నగర్‌ 11, సంగారెడ్డి, సూర్యాపేట 9 చొప్పున, కామారెడ్డి 7, జయశంకర్‌ భూపాలపల్లి 6, జోగుళాంబ గద్వాల 4, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం 3 చొప్పున, నాగర్‌కర్నూల్‌, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌, జగిత్యాల 2 చొప్పున, సిద్దిపేట, వనపర్తి, జనగామ, ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాలతో ఏడుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 313కు పెరిగింది. మంగళవారం 6,220 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,28,438కు చేరింది.