విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహా నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి నివాసం నుంచి వర్చువల్ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రప్రజలు చూడదగిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామని అన్నారు. అంబేద్కర్ చేసిన మంచిపనులు ఎప్పటికేఈ గుర్తుండేలా పార్కును అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. 20 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, ఆహ్లాదకరమైన పార్కును నిర్మిస్తామని వైఎస్ జగన్ వివరించారు.
స్వరాజ్ మైదానం పేరును అంబేద్కర్ స్వరాజ్ మైదానంగా మార్పు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మూడు దశల్లో ఏడాదిలోగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమంలో ఏపీ మంత్రులు విశ్వరూప్, వనిత, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.