ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

 గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకోసం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైందని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఆర్ట్స్‌, సైన్స్‌తోపాటు ఒకేషనల్‌ కోర్సుల్లో 7,040 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. టీటీడబ్ల్యుఆర్‌జేసీసెట్‌ ఫలితాల ఆధారంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్థానికతను బట్టి కేటాయించిన కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారని వివరించారు. ఈ ప్రక్రియ ఈ నెల 18 వరకు కొనసాగుతుందని చెప్పారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలు, కంటైన్మెంట్‌ జోన్లలో నివసించే విద్యార్థులు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత స్వయంగా హాజరు కావాలని, ముందుగా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లను సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం tgtwgurukulam.telangana.gov.in ను సంప్రదించాలన్నారు.