తెలంగాణలో 40 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడంలేదు. గురువారం 1,676 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 40 వేలు దాటింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 788 మందికి వైరస్‌ సోకినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.  రంగారెడ్డిలో 224 మంది, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 160, కరీంనగర్‌ 92, నల్లగొండ 64, సంగారెడ్డి 57, వనపర్తి 51, వరంగల్‌రూరల్‌ 47, నాగర్‌కర్నూల్‌ 30, మెదక్‌ 26, నిజామాబాద్‌, సూర్యాపేటలో 20, మహబూబాబాద్‌ 19, ఖమ్మం 10, జయశంకర్‌భూపాలపల్లి, వికారాబాద్‌ 8 చొప్పున, పెద్దపల్లి, నారాయణపేట 7, మహబూబ్‌నగర్‌, భద్రాద్రికొత్తగూడెం 6, సిద్దిపేట, కామారెడ్డి, జోగుళాంబగద్వాల 5 చొప్పున, మంచిర్యాల 4, రాజన్న సిరిసిల్ల 3, వరంగల్‌రూరల్‌, జగిత్యాల, యాదాద్రిభువనగిరి, జనగామ జిల్లాల్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

వైరస్‌తోపాటు ఇతర అనారోగ్యకారణాలతో 10 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 396కు పెరిగింది. 1,296 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో బాధితుల రికవరీ రేటు 67 శాతంగా ఉన్నదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 2.22 లక్షల నమూనాలను పరీక్షించామని పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 15,389 పడకలు అందుబాటులో ఉన్నట్టుచెప్పింది. కాగా, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బందిలో ఇద్దరికి వైరస్‌ సోకింది. హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి సైతం వైరస్‌ బారినపడ్డారు.  కలెక్టరేట్‌లోని           15 మందికి సిబ్బందికి కరోనా సోకగా, వారి ద్వారా కలెక్టర్‌కు వ్యాప్తిచెందినట్టు తెలుస్తున్నది.