రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు సాగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులే కాకుండా హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి.. మొక్కలు నాటడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. మొక్కలు నాటిన విషయాన్నివారంతా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని ఇచ్చిన ఛాలెంజ్ ను మరో నటి అనుపమ పరమేశ్వరన్ స్వీకరించారు. ఇవాళ అనుపమ కేరళ తిరుచూరులోని తన నివాసంలో ఒక మొక్కను నాటారు. అనంతరం సెల్ఫీ దిగారు.
ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ…నేను గత కొన్ని రోజుల క్రితమే 25 మొక్కలు నాటాను.. అందులో 23 మొక్కలు మంచిగా బతికాయి. రెండు మొక్కలు మాత్రం చనిపోయాయి. ఆ రెండు మొక్కలు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఇంతలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా నాకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చాలా సంతోషంగా ఈ చాలెంజ్ ను స్వీకరించి ఈరోజు మా ఇంటి ఆవరణలో ఒక మొక్క నాటాను. మా ఇంటి ఆవరణలో ఎక్కువ ఖాళీ స్థలం లేని కారణంగా ఒక మొక్కను మాత్రమే నాటాను. తప్పకుండా మిగతా మొక్కలను కూడా త్వరలోనే నాటుతానని ప్రమాణం చేస్తున్నాను. ఇంతమంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు కొనసాగాలని అందరు బాధ్యతగా మొక్కలు నాటాలని అనుపమ పిలుపునిచ్చారు. నేను ఈ సందర్భంగా మరొక 12 మందిని మొక్కలు నాటాలని చాలెంజ్ విసురుతున్నా. కాళిదాస్ జయరామ్, నివేదా థామస్, ఆహన కృష్ణ, రాజీష్ విజయాన్, పద్మ సౌర్య, పిరలే మాన్య, గౌరీ కృష్ణ, గౌతమి నైరి, సిజ్జు విల్సన్, అను సితార, సితార కృష్ణ శంకర్, లక్ష్మీ ప్రియ విశాకులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నా. వారంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకుపోవాలని అనుపమ విజ్ఞప్తి చేశారు.