కళాకారులకు ఉన్నతస్థానం : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి

భారతీయ సంప్రదాయంలో కళాకారులు, భగవంతుని ఆరాధకులకు  ఉన్నతస్థానం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. యువకళావాహిని, జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు రామరాజు లక్ష్మీ శ్రీనివాస్‌ వీణపై పలికించిన కట్టెదుర వైకుంఠం(అన్నమయ్య, పురందర దాస కీర్తనలు) హిమగిరి తనయే(వాగ్గేయకార కృతులు) సీడీల ఆవిష్కరణ   ఏసీగార్డ్స్‌లోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగింది. వృత్తిరీత్యా కళాకారులకంటే ప్రవృత్తిరీత్యా కళాకారులయ్యే వారినే  గొప్పవారుగా భావిస్తానని రమణాచారి అన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ భారతీయ సంగీతానికి ప్రపంచంలోనే ప్రత్యేకత ఉందన్నారు. సంగీతాన్ని ఆరాధించే సంప్రదాయం మనది అన్నారు.  అంతకుముందు జర్నలిస్టు జీఎల్‌ఎన్‌ మూర్తి శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందడంతో అతడికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు మహ్మద్‌ రఫీ, యువకళావాహిని అధ్యక్షుడు వై.కె నాగేశ్వరరావు, జి.వి.ఆర్‌ ఆరాధన సంస్థ అధ్యక్షుడు గుదిబండ వెంకటరెడ్డి, వి.వి రాఘవరెడ్డి, రామరాజు శ్రీనివాసరావు  పాల్గొన్నారు.