ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారోత్సవం నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, స్వర్ణపాలెస్ ప్రమాద మృతులకు బీజేపీ నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర, దేశాభివృద్ధి బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగులు నింపడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలను అందించాలన్నారు. ‘‘జన్ధన్ ఖాతా ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపాం. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలి. ఏపీ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని’’ ఆయన తెలిపారు.