రూ.కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్ నాగరాజుపై ఏసీబీ అధికారులు ప్రశ్న ల వర్షం కురిపిస్తున్నారు. ఏసీబీ కోర్టు అనుమతితో మంగళవారం ఉదయంచంచల్గూడ జైలు నుంచి తాసిల్దార్ నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్లను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకొని తమ శాఖ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
విడివిడిగా విచారణ..
ఏసీబీ సోదాల్లో పట్టుబడిన సొమ్ముతోపాటు పలు పత్రాలకు సంబంధించిన ప్రాథమిక వివరాలు ఇప్పటికే సేకరించిన అధికారులు వాటి ద్వారా ఉత్పన్నమవుతున్న ప్రశ్నలకు నిందితుల నుంచి జవాబులు రాబడుతున్నారు. నలుగురు నిందితులను వేర్వేరు అధికారులతో కూడిన ద ర్యాప్తు బృందాలు విచారిస్తున్నట్టు తెలిసింది. పలు వివాదాస్పద భూములకు సంబంధించి ఈ నలుగురు కలిసి ఏయే అక్రమాలకు పాల్పడ్డారన్నది వేర్వేరుగా ప్రశ్నిస్తూ స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ప్రధాన నిందితుడైన నాగరాజును దాదాపు 7 గంటలకుపైగా ప్రశ్నించినట్టు సమాచారం. అంజిరెడ్డి, శ్రీనాథ్ల నుంచి పలుకీలక అంశాలపై విషయాలు తెలుసుకున్నట్టు సమాచారం. బుధవారం మరోమారు నలుగురినీ కస్టడీకి తీసుకోనున్నారు. రెండోరోజు విచారణలో కీలక అంశాలపై ప్రశ్నించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.