దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిరాడంబర నాయకుడు అని, ఆయన ఎమ్మెల్యే కాక ముందే తనకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. రామలింగారెడ్డి మృతిపట్ల తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తదని తన ఊహకు కూడా లేకుండే. బాధాతప్త హృదయంతో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నా. రామలింగారెడ్డి మృతిపట్ల ఈ సభ సంతాపం తెలుపుతోంది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి.. నిత్యం ప్రజల మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబరగా నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణం దుబ్బాక నియోజకవర్గం ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల హృదయాలను కలిచివేసింది.
సామాన్య రైతు కుటుంబంలో జన్మింనిచిన సోలిపేట రామలింగారెడ్డి.. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. మెదక్ జిల్లాలో జరిగిన ఉద్యమాలకు బాసటగా నిలిచారు. జర్నలిస్టుగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారాల కోసం అనేక రాజీ లేని పోరాటాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కాక ముందు నుంచే తనకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉంది. తాను నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టిన అభ్యుదయవాది. వరకట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కాళోజీ, తన చేతుల మీదుగా ఆదర్శ వివాహం జరిగింది. అదే విధంగా తన పిల్లలకు కూడా వివాహాలు జరిపించారు.
రామలింగారెడ్డిలోని నిబద్ధత, విశ్వసనీయత, నాయకత్వ లక్షణాలు గమనించి.. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఇచ్చాం. ఆ ఎన్నికల్లో దొమ్మాట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచి యువ నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. సమైక్యవాదులు కల్పించే ప్రలోభాలకు లొంగకుండా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉద్యమ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. 2014, 18 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం పని చేసేవారు. మధుమేహ వ్యాధితో బాదపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు అని సీఎం కేసీఆర్ తెలిపారు.