కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్కును ద‌త్త‌త తీసుకున్న హీరో ప్ర‌భాస్

కాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్‌తో క‌లిసి హీరో ప్ర‌భాస్ సోమ‌వారం శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ చొరవ‌తో పార్కును ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తెలిపారు. 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. త‌క్ష‌ణ సాయంగా రూ.2 కోట్లు అంద‌జేసిన‌ ప్ర‌భాస్.. అవ‌స‌రాన్ని బ‌ట్టి మ‌రింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ మాట్లాడుతూ త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల‌ను ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి ప‌రిచే విధంగా ప్ర‌య‌త్నాలు చేస్తామ‌న్నారు. మంత్రి, ఎంపీతో క‌లిసి హీరో ప్ర‌భాస్ పార్కులోని వ్యూ పాయింట్‌, త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించి, రావి, జువ్వి, కుసుమ మొక్క‌ల‌ను పార్కులో నాటారు. కార్యక్రమంలో ప్ర‌భుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.