పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. ఆరవ విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డు ఆర్ఎల్ నగర్ కాలనీలో వైస్ చైర్మన్ మల్లేష్యాదవ్, కమిషనర్ వాణి, కౌన్సిలర్లతో కలిసి 12 రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాను గ్రీనరీగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.