రెండో రోజు కొనసాగుతున్న కోటి 12 ల‌క్ష‌ల లంచం కేసు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీ విచార‌ణ రెండో రోజు కొన‌సాగుతోంది. మెద‌క్ మాజీ అద‌న‌పు క‌లెక్ట‌ర్ న‌గేశ్‌, ఆర్డీవో అరుణారెడ్డి, త‌హ‌సీల్దార్ స‌త్తార్‌, జూనియ‌ర్ అసిస్టెంట్ వ‌సీం, జీవ‌న్‌గౌడ్‌ను ఏసీబీ అధికారులు రెండో రోజు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. చంచ‌ల్‌గూడ జైల్లోని నిందితుల‌ను బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాల‌యానికి త‌ర‌లించారు. న‌గేశ్ బ్యాంకు లాక‌ర్‌పై నేడు విచార‌ణ కొన‌సాగ‌నుంది. రూ. 40 ల‌క్ష‌ల‌పై స్ప‌ష్ట‌త రాలేదు. అవినీతి, బినామీ ఆస్తుల‌పై న‌గేశ్‌ను అధికారులు ప్ర‌శ్నించ‌నున్నారు. ప‌లువురు అనుమానితులు, సాక్షుల‌ను కూడా విచారించ‌నున్నారు. 

ఈ కేసులో గడ్డం నగేశ్‌ను ఏ1గా, సర్వేఅండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఎండీ వసీం అహ్మద్‌ను ఏ2గా, నర్సాపూర్‌ ఆర్డీవో బీ అరుణారెడ్డిని ఏ3గా, చిలిపిచేడు తాసిల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌ను ఏ4గా, నగేశ్‌ బినామీ కోల జీవన్‌గౌడ్‌ను ఏ5గా ఏసీబీ పేర్కొన్నది. లంచం మొత్తంలో అడ్వాన్స్‌ రూ.40 లక్షలుపోగా మిగిలిన రూ.72 లక్షలకు నగేశ్‌ తన బినామీ జీవన్‌గౌడ్‌ పేరిట ఐదెకరాల భూమికి అగ్రిమెంట్‌ చేసుకోవడంతోపాటు బాధితుడి నుంచి ఎనిమిది బ్లాంక్‌ చెక్కులను తీసుకున్నట్టు అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.