మహారాష్ట్ర భీవండి భవన ప్రమాదంలో 33కి చేరిన మృతులు

మహారాష్ట్ర భీవండిలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 33కి పెరిగింది. 43 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం సోమవారం తెల్లవారు జామున 3.40గంటలకు కూలిన విషయం తెలిసిందే. ఈ భవనంలో 40 ఫ్లాట్లు ఉండగా, అందులో సుమారు 150 మంది నివసిస్తున్నారు. మూడు రోజులుగా థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ పనులు కొనసాగిస్తున్నాయి. సుమారు వంద మందికిపైగా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. థానే నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీవండిలో ఎక్కువగా పవర్‌ లూం కార్మికులు నివసిస్తుంటారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెతికేందుకు క్యానిన్ స్క్వాడ్‌ను వినియోగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ భవనం భీవండి-నిజాంపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల జాబితాలో లేదని, భవనం యజమాని సయ్యద్ అహ్మద్ జిలానీపై ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చని మున్సిపల్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.