ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నది. ఆగస్టు 5 నుంచి కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ఆందోళనకరస్థాయిలో క్షీణించిందని ఎంజీఎం అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధ భాస్కరన్ గురువారం తెలిపారు.బాలుకు ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి బయటపడ్డారు. పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. స్వయంగా ఆహారం కూడా తీసుకున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కొద్దిరోజుల క్రితమే తెలిపారు. అంతలోనే బాలు ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినటంతో కృత్రిమ శ్వాస ద్వారానే ఆయనకు చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఫిజియో థెరపీ కూడా చేస్తున్నారు. తాజాగా ఆయనకు బ్రెయిన్ హ్యామరేజ్ అయినట్టు సమాచారం. బాలు ఆరోగ్యంపై సినీలోకం, అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కాగా, ప్రముఖ నటుడు కమల్హాసన్ గురువారం రాత్రి ఎంజీఎం దవాఖానకు వెళ్లి బాలు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా బాలు గురించి వైద్యులను ఆరాతీశారు.