హాస్యవిలన్ నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హాస్యవిలన్‌ నర్సింగ్‌యాదవ్ ‌(52) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సమస్య(క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌)తో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం సోమాజిగూడలోని యశోద దవాఖానకు డయాలసిస్‌ కోసం వచ్చారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించింది. చికిత్స అందిస్తుండగా గురువారం రాత్రి మృతి చెందినట్టు దవాఖన వర్గాలు తెలిపాయి. నర్సింగ్‌యాదవ్‌కు భార్య చిత్ర, కుమారుడు రిత్విక్‌ ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు సుల్తాన్‌బజార్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు.