తెలంగాణలో కొత్తగా 5,926 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజువారీ పాజిటివ్‌ కేసులు మంగళవారం భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 5,926 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా మహమ్మారి బారినపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,209 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో వైపు రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 42వేలు దాటాయి. ప్రస్తుతం 42,853 యాక్టి్‌వ్‌ కేసులున్నాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కి చేరాయి.

ఇప్పటి వరకు 3,16,650 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 1,856 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 793 జీహెచ్‌ఎంసీలోనే ఉన్నాయి. నిన్న 1,22,143 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 87.62 శాతం, మరణాల రేటు 0.51శాతం ఉందని పేర్కొంది.