ముక్కోటి వృక్షార్చన విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 24న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చనను న విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అడవుల పెంపకానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నార‌ని, మానవుల మనుగడకు చెట్లే ఆధారమ‌న్నారు. భూభాగం లో 33 శాతం పచ్చధనం ఉండాలనే లక్ష్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి తెలంగాణ హరితహారం అనే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా గత ఐదేళ్ల కాలంలో 220 కోట్ల మొక్కలను నాటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో 21 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించార‌న్నారు. ముక్కోటి వృక్షార్చనలో నాటిన మొక్కలను సంరక్షించడానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు.

24వ తేదీన ఉదయం 10 గంటల నుంచి జరిగే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు,యువత రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలను నాటాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వ‌రంగ‌ల్ జిల్లాలో వ‌ర్షాలు అధికంగా కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.