హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక రిమిషన్ మేరకు అర్హత సాధించిన 91 మంది యావజ్జీవ ఖైదీలను తెలంగాణ కారాగారాలు & సంస్కరణ సేవల శాఖ ఈరోజు విడుదల చేసింది. విడుదలైన వారిలో 85 మంది పురుష ఖైదీలు, 6 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. వీరందరూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రిమిషన్కు అర్హులుగా గుర్తించబడ్డారు. విడుదల అనంతరం ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన, సార్థకమైన జీవితం గడపగలిగేలా పునరావాసం మరియు సమాజంలో విజయవంతమైన పునఃసమైక్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ కారాగార శాఖ పలు చర్యలు చేపట్టింది.
ఈరోజు విడుదలైన 91 మందిలో 38 మందికి తెలంగాణ కారాగార శాఖ నిర్వహిస్తున్న వివిధ ఫ్యూయల్ అవుట్లెట్లుల్లో ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. విడుదలైన వెంటనే జీవనోపాధి పొందేందుకు మరియు సమాజంలో సాఫీగా కలిసిపోవడానికి ఈ నియామకాలు తోడ్పడనున్నాయి. మరో 53 మంది విడుదలైన ఖైదీలు స్వయం ఉపాధి, వ్యవసాయం, కుటుంబ వ్యాపారాలు మరియు ఇతర స్వతంత్ర వృత్తులను చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఇది వారు చట్టబద్ధమైన, నిర్మాణాత్మక మార్గంలో తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. మహిళా సాధికారత మరియు పునరావాసానికి, నలుగురు మహిళా ఖైదీలకు జైలు అభివృద్ధి నిధి ద్వారా అమలు చేస్తున్న స్వయం ఉపాధి సహాయ పథకం కింద కుట్టు మిషన్లు అందజేయబడ్డాయి. ఈ సహాయం ద్వారా వారు స్థిరమైన జీవనోపాధిని ఏర్పరుచుకుని ఆర్థిక స్వావలంబన సాధించగలరని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ కారాగారాలు శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, ఐపీఎస్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కేవలం ఖైదీల విడుదల మాత్రమే కాదని, బాధ్యత, గౌరవం మరియు ఆశతో కూడిన కొత్త జీవితానికి శ్రీకారం చుట్టే సందర్భమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తిలో మార్పు సాధించే శక్తి ఉందని, శిక్ష విధించడం మాత్రమే కాకుండా సంస్కరణ మరియు సానుకూల మార్పుకు అవకాశం కల్పించడం కూడా కారాగార వ్యవస్థ లక్ష్యమని ఆమె తెలిపారు. విడుదలైన ఖైదీలు జైలు జీవితం మొత్తం తమ మంచి ప్రవర్తన, క్రమశిక్షణ మరియు సంస్కరణ పట్ల నిబద్ధత ద్వారా ఈ అవకాశాన్ని సంపాదించుకున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చట్టబద్ధమైన జీవితాన్ని గడపాలని, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మారాలని సూచించారు. కుటుంబాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని, విజయవంతమైన పునరావాసానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. తెలంగాణ కారాగార శాఖ విద్య, వృత్తి శిక్షణ, ఉపాధి ఆధారిత కార్యక్రమాలు, కౌన్సెలింగ్ మరియు సంక్షేమ పథకాల ద్వారా జైళ్లను సంస్కరణ, నైపుణ్యాభివృద్ధి మరియు పునరావాస కేంద్రాలుగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తోందని డాక్టర్ మిశ్రా తెలిపారు. ఖైదీ జైలు గేటు దాటిన తర్వాత కూడా పునరావాస ప్రక్రియ ముగియదని, విడుదల అనంతర సహాయం కూడా విజయవంతమైన పునఃసమైక్యానికి ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలకు అందించిన ఉపాధి మరియు స్వయం ఉపాధి సహాయం గురించి ప్రస్తావిస్తూ, జీవనోపాధి అవకాశాలు మాజీ ఖైదీలు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి కీలకమని చెప్పారు. 38 మందికి ఇంధన విక్రయ కేంద్రాల్లో ఉద్యోగాలు కల్పించడం, అర్హులైన మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు అందించడం ద్వారా శాఖ సంస్కరించబడిన వ్యక్తులకు విడుదల అనంతరం కూడా అండగా నిలుస్తోందని తెలిపారు.
విడుదలైన ఖైదీలు ఈ అవకాశాన్ని బాధ్యతాయుతంగా వినియోగించుకుని సమాజంలో మార్పుకు రాయబారులుగా నిలుస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఖైదీల పునరావాస ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం, కారాగార శాఖ అధికారులు, ఖైదీల కుటుంబ సభ్యులు మరియు పౌర సమాజం అందిస్తున్న సహకారాన్ని ఆమె అభినందించారు. ప్రతి అర్హుడైన వ్యక్తికి తన జీవితాన్ని పునర్నిర్మించుకునే సమాన అవకాశం కల్పిస్తూ, సంస్కరణ, పునరావాసం మరియు మానవ గౌరవం అనే విలువలను తెలంగాణ కారాగార శాఖ నిరంతరం పాటిస్తుందని పునరుద్ఘాటించారు. డాక్టర్ సౌమ్య మిశ్రా, రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా కి, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి ఖైదీల పునరావాసం మరియు కారాగార సంస్కరణలకు అందిస్తున్న నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కారాగారాల ఇన్స్పెక్టర్ జనరల్స్ వై. రాజేష్, ఎన్. మురళీబాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్ డా. డి. శ్రీనివాస్, ఎం. సంపత్, సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్ సూపరింటెండెంట్ ఎన్. శివకుమార్ గౌడ్, సెంట్రల్ ప్రిజన్ వరంగల్ సూపరింటెండెంట్ కలాసాగర్, సెంట్రల్ ప్రిజన్ సంగారెడ్డి సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్, ఎస్పీడబ్ల్యూ హైదరాబాద్ సూపరింటెండెంట్ శ్రీమతి టి. వెంకట లక్ష్మి శ్రీనాథ్, సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లి సూపరింటెండెంట్ జి. ప్రమోద్, ఖైదీల వ్యవసాయ కాలనీ చెర్లపల్లి సూపరింటెండెంట్ డి. భరత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విడుదలైన ఖైదీల కుటుంబ సభ్యులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజలు కూడా కార్యక్రమంలో పాల్గొని, ఖైదీలు తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ సందర్భంగా వారికి ప్రోత్సాహం మరియు మద్దతు అందించారు.