రైతు వేదికల్లో విత్తన మేళా – రైతు ముంగిట నాణ్యమైన విత్తనాలు

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల జూలై 27 నుంచి 29 వరకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రతి మండల కేంద్రంలోని రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగుకు అనువైన ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రతి రైతు వేదికలో 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ విత్తన మేళాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTU), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ (IIOR), కృషి విజ్ఞాన కేంద్రాల (KVKs) శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు పంటల ఎంపిక, సాగు విధానాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతులపై శాస్త్రీయ సలహాలు, సూచనలు అందిస్తారు. ఆయా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు సిఫారసు చేసిన నాణ్యమైన విత్తనాలు కూడా ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి.

అదేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు), మండల వ్యవసాయ అధికారులు (MAOలు), సహాయ వ్యవసాయ సంచాలకులు (ADAలు), జిల్లా వ్యవసాయ అధికారులు (DAOలు), ఉద్యాన శాఖ అధికారులు రైతులకు పంటల ఎంపిక, విత్తనాల ఎంపిక, సాగు విధానాలు, నీటి యాజమాన్యంపై అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. రాష్ట్రంలోని రైతులందరూ తమ సమీప రైతు వేదికలో నిర్వహించే విత్తన మేళాలో అధిక సంఖ్యలో పాల్గొని, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తమ ప్రాంతానికి అనువైన పంటలను ఎంపిక చేసుకొని, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సంచాలకులు తెలిపారు