యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వైద్యులతో చికిత్స వివరాలపై ఆరా

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి అనంతరం వైద్యులతో మాట్లాడి అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.