హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలయ్యేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయము అవసరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, మహేష్ దత్ ఎక్క, సవ్య సాచి ఘోష్, వాణి ప్రసాద్, దాన కిషోర్, నవీన్ మిట్టల్,ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, అహ్మద్ నదీమ్, క్రిస్టినా చొంగ్తూ, రఘునందన్ రావ్, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్, హరిచందన, బాల మాయాదేవి, సురేంద్ర మోహన్, ఇలంబర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతతో రాష్ట్రంలో పురోగతిలో ఉన్నఅనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలయ్యేందుకు వివిధ శాఖల మధ్య అంతర్గత సమన్వయము అవసరమని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, లక్ష్యాలు, అమలు తదితర వివరాలను సవివరంగా తెలిపే డాష్ బోర్డు ను ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా ఈ పథకాలు, కార్యక్రమాలు లక్ష్యాల మేరకు అమలవడానికి స్పీడ్ సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మరో వారం రోజుల్లో ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ పథకాలు, కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల పనితీరు, లక్ష్యాలు, పురోగతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రప్రాయోజిత పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యదర్శులతో త్వరలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని, ఇందుకు సన్నద్ధం కావాలని కార్యదర్శులకు సూచించారు. ప్రతీ శాఖలో అమలవుతున్న వినూత్న పథకాలు/ విజయ గాధాలపై నివేదిక రూపొందించాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలతో సహా అన్నింటికీ టి- ఫైబర్ కనెక్టివిటీ ని తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విజన్ డాక్యుమెంట్-2047 లో సూచించిన నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికా బద్దంగా పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, నివేదికలు, ప్రతిపాదనలను సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని, తద్వారా కేంద్ర నిధులు విడుదల కావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. నవంబర్ 14వ తేదీ నుండి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఖేలో-ఇండియా క్రీడోత్సవాలను విజయ వంతంగా నిర్వహించేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దాదాపు 7 వేలకు పైగా క్రీడా కారులు, అధికారులు, కోచ్ లు హాజరయ్యే ఈ ఖేలో ఇండియా స్పోర్ట్స్ కు 26 క్రీడా రంగాల్లో పోటీలను 11 వేదికలలో నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. కొర్ పరిధిలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలన్న ముఖ్యమంత్రిగారి ఆదేశాలమేరకు డీజిల్ తో నడిచే ఆటోలకు ఎలక్ట్రిక్ ఇంజన్లు అమర్చే పథకాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావంతో వరి పంటకు సరిపడా నీరు లభ్యం కాదని, ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల పట్ల రైతులకు అవగాహన కల్పించాలని సిఎస్ సూచించారు.
