- అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి
- భారీ పెట్టుబడుల ఆకర్షణకు గ్లోబల్ సమ్మిట్ వేదికగా నిలవాలి
హైదరాబాద్ : డిసెంబర్లో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్–2026” గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సి.ఎస్ మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్–2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం అత్యంత అవసరమని అన్నారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధికి గ్లోబల్ సమ్మిట్ కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
తెలంగాణను అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్” కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవన సముదాయాలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే రహదారులు, విద్యుత్, తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను సకాలంలో సిద్ధం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయడం, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను విస్తరించడం, ఉపాధి కల్పనను పెంపొందించడం, డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడం వంటి అంశాలపై సమావేశంలో అధికారులు విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.