- ప్రతి నెల 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణలోని 3.42 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ప్రతి అర్హుడికి ప్రతి నెల 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలుకు ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డిలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ అదే రోజు ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన ఆహార భద్రతను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. “స్వతంత్ర భారతదేశంలో అత్యంత సమర్థవంతమైన ఆహార భద్రతా కార్యక్రమాల్లో ఒకటైన ఈ మహత్తర కార్యక్రమంలో చిన్న పాత్ర పోషించడం ఆనందదాయకంగా ఉందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ స్మార్ట్ రేషన్ కార్డులను పొందేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని స్పష్టం చేశారు.