పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • 15–30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి
  • జిల్లా మానిటరింగ్ కమిటీలలో రైతులను భాగస్వాములను చేయాలి
  • కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళీకృతం చేయాలి
  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి రైతులకు మేలు కలిగేలా చూడాలి
  • పత్తి రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు 1800 599 5779 మరియు 88971 81111 వాట్సాప్ చాట్ బాట్ ఏర్పాటు
  • సీసీఐ అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 2026-27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సీసీఐ అధికారులతో హైద్రాబాద్ లోని గోల్కొండ హోటల్లో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడి పంట పండించిన రైతులకు మార్కెటింగ్‌లో ఎక్కడా ఇబ్బంది కలగకూడదని, ఒకరిద్దరి కారణంగా మొత్తం వ్యవస్థలకు చెడ్డపేరు రాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. “మనం బతకాలంటే రైతు బతకాలి” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పనిచేయాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లి పత్తి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పంట కోతకు దాదాపు రెండు నెలల ముందుగానే పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రకృతిపై ఆధారపడి పత్తి సాగు చేసే రైతులలో సన్న చిన్నకారు రైతులే అధికంగా ఉన్నందున, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ప్రక్రియను ముందుగానే పకడ్బందీగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

పత్తి కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని మంత్రి స్పష్టం చేశారు. రైతుల నుంచి నేరుగా, పారదర్శకంగా పత్తి కొనుగోలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. గత సీజన్లలో పత్తి కొనుగోళ్లపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించిన అంశాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకుని, ఈ సీజన్‌లో అటువంటి లోపాలు, అవకతవకలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2026-27 సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, సుమారు 25.85 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. ఈ సీజన్‌కు Long Staple Cottonకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8,667 కనీస మద్దతు ధర (MSP) ప్రకటించిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.557 MSP పెరిగిందని చెప్పారు. ప్రతి అర్హత కలిగిన రైతుకు MSP ప్రయోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు MSP కంటే తక్కువ ధరకు పత్తిని విక్రయించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని ఆదేశించారు.

రాష్ట్రంలోని 356 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా L1 నుంచి L12 వరకు అన్ని కేటగిరీల మిల్లులను అవసరానికి అనుగుణంగా ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 15 నుంచి 30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గత సీజన్‌లో 122 CCI కొనుగోలు కేంద్రాలు ఉండగా, ఈ సీజన్‌లో వాటి సంఖ్యను 131 కేంద్రాలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. అన్ని కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మార్కెట్ కు పత్తి రాక అధికంగా ఉండే ప్రాంతాల్లో అవసరమైన మేరకు అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక ప్రాంతంలో జిన్నింగ్ మిల్లు అందుబాటులో లేకపోతే, సంబంధిత గ్రామాలు, మండలాలను సమీపంలోని నోటిఫైడ్ మిల్లుకు అనుసంధానం చేసి రైతులకు ఎక్కువ దూరం ప్రయాణించకుండా చూడాలన్నారు.

ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీల్లో రైతుల ప్రతినిధులను కూడా చేర్చుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి రాకను క్రమబద్ధీకరించాలని, అవసరమైతే సాయంత్రం 6 గంటల తర్వాత కూడా కొనుగోలు సమయాన్ని స్థానిక కమిటీలు పరిస్థితులకు అనుగుణంగా పొడిగించాలని చెప్పారు. జిల్లాస్థాయి అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించి రైతులకు ఎదురవుతున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్స్ ఓపెన్ చేసే ముందు సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా మార్కెటింగ్ అధికారులకు సమాచారం అందించి రైతులకు విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళీకృతం చేసి, ఒక రైతు లేదా మొబైల్ నంబర్‌కు అవసరమైన విధంగా మల్టిపుట్ బార్ కోడ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. పంట బుకింగ్ డేటాను NIC ద్వారా కపాస్ కిసాన్ యాప్ కు అత్యంత వేగంగా బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర సగటు దిగుబడిని ప్రకటించి, దానికంటే అధిక దిగుబడి పొందిన రైతులకు AEOల ద్వారా డిజిటల్ Yield Certificates వెంటనే జారీ చేయాలని మంత్రి సూచించారు. దీనివల్ల అధిక దిగుబడి సాధించిన రైతుల పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు. పత్తి అధికంగా ఉత్పత్తి అయ్యే ప్రధాన జిల్లాల్లో అవసరమైన మేరకు కాటన్ టెస్టింగ్ ల్యాబులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లులలో Staple Length, Micronaire, తేమశాతం తదితర నాణ్యత ప్రమాణాలను పరీక్షించే పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో CCTVలు తప్పనిసరిగా పనిచేసేలా చూడాలని, బరువు కొలిచే యంత్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు.

రైతులకు MSPపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. రైతు నేస్తం, గ్రామస్థాయి కార్యక్రమాలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా MSP, కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలు, Slot Booking విధానం తదితర అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. రైతుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 1800 599 5779 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, 88972 81111 వాట్సాప్ చాట్ బాట్ సేవలను రైతులు వినియోగించుకునేలా ప్రచారం చేయాలని చెప్పారు. ప్రతి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన Dedicated Help Deskను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ లేదా పెండింగ్ ఏర్పడినప్పుడు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రస్థాయి కమిటీ, జిల్లాస్థాయి కమిటీలు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, CCI, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. రైతుకు MSP అందించడమే ప్రధాన లక్ష్యం. ఈ విషయంలో ఏ స్థాయిలోనైనా నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగితే తీవ్రంగా పరిగణిస్తాం. పత్తి కొనుగోళ్లలో రైతులకు నష్టం కలిగించే చర్యలు, అవకతవకలు చోటుచేసుకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అన్ని శాఖలు, రాష్ట్ర మరియు జిల్లాస్థాయి కమిటీలు, CCI అధికారులు సమిష్టి బాధ్యతతో పనిచేసి ప్రతి రైతుకు MSP ప్రయోజనం అందేలా చూడాలని ఆయన ఆదేశించారు.