మహబూబాబాద్ కృష్ణా కాలనీకి చెందిన దీక్షిత్ రెడ్డి(9) హత్య కేసులో నిందితుడు మందసాగర్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీక్షిత్ రెడ్డిని ఎక్కడైతే హత్య చేశారో అదే ప్రాంతంలో నిందితుడిని ఎన్కౌంటర్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వివరణ ఇచ్చారు. మంద సాగర్ను ఎన్కౌంటర్ చేయలేదని, అతను తమ అదుపులోనే ఉన్నాడని స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అరెస్టు చేశామన్నారు. మంద సాగర్తో పాటు మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఇప్పటి వరకైతే దీక్షిత్ను కిడ్నాప్ చేసి, హత్య చేసింది మంద సాగర్ అని విచారణలో తేలింది. మనోజ్ రెడ్డి పాత్రపై కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు.