ఈ ఏడాది దీపావళి పర్వదినం రోజున ఢిల్లీ ప్రభుత్వం అక్షరాల రూ. 6 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా కేవలం లక్ష్మీ పూజకు చేసిన ఖర్చు మాత్రమే. దీపావళి పండుగ రోజు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందని సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోగా.. అక్షరాల రూ. 6 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాధానం ఇచ్చింది. నవంబర్ 14వ తేదీన అరవింద్ కేజ్రీవాల్, మంత్రులతో పాటు వారి కుటుంబ సభ్యులు అక్షరాధామ్ టెంపుల్లో నిర్వహించిన లక్ష్మీపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అర గంట పాటు లైవ్ టెలికాస్ట్ చేశారు. దీని కోసం రూ. 6 కోట్లు ఖర్చు అయింది. అంటే నిమిషానికి రూ. 20 లక్షల చొప్పున ఖర్చు పెట్టారని సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి, గాలి నాణ్యతా ప్రమాణాలు పడిపోవడంతో బాణాసంచా కాల్చొద్దని ఢిల్లీ సీఎం నాడు ఆదేశించిన విషయం తెలిసిందే.