నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం తొలి ప్రాధాన్యం ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 1,10,840 ఓట్లు సాధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో ఫలితం తేలకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండలో పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో 3,87,969 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 3,66,333 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఏడు రౌండ్లలో 21,636 ఓట్లు చెల్లకుండాపోయాయి. పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,10,840 ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరామ్కు 70,072, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 39,107ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్కు 27,588 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సెకండ్ ప్రయారిటీ ఓట్లు కీలకంగా మారాయి.