శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘాటైన గ్యాస్‌ లీక్‌

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రైనేజీ పైపులకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్ట్‌ సమీపంలో ఉన్న భవనంలో డ్రైనేజీ పైపులకు లీకేజీ రావడంతో ప్రైవేట్‌ ఏజెన్సీకి చెందిన ప్లంబర్లు నాగన్నగారి నరసింహారెడ్డి(42), జకీర్, ఇలియాస్‌ మరమ్మతులకోసం వచ్చారు. లీకేజీ భవనం పైఅంతస్తు నుంచి వస్తున్న పైపులో ఉండడంతో నిచ్చెన సాయంతో ఎక్కి ఫాల్స్‌ సీలింగ్‌ కొంతభాగం తొలగించి పైపులో యాసిడ్‌ పోశారు. దాంతో డ్రైనేజీ పైపు నుంచి ఘాటైన గ్యాస్‌ లీక్‌ కావడంతో నరసింహారెడ్డికి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందగా జకీర్, ఇలియాస్‌లు అక్కడే పడిపోయారు. అధికారులు వారిని ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు.