- ఏప్రిల్, మే నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు
- వచ్చే మూడేళ్ల లో పట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇళ్లు
- శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబధాల శాఖా మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ఆచరణలో చూపిస్తుందన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో పట్టణ ప్రాంతాలల్లోని ప్రతీ వార్డులో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. శాసన మండలిలో మంగళవారం నాడు హౌసింగ్ పై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. “ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే మొదటి విడతలో ఇళ్ల మంజూరు జరగగా, మిగిలిన మూడు విడతలను కూడా దశలవారీగా పూర్తిచేస్తాం.
రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలు, గూడాల్లో గతంలో ప్రారంభమై వివిధ స్థాయిలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది. వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, లబ్ధిదారులకు అనుకూలంగా మార్పులు చేపడతాం. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్ష ఉండదు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అత్యంత పేదలకే ప్రాధాన్యం ఇస్తాన్నాం. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి సుమారు లక్ష ఇళ్లు పూర్తి కానున్నాయి. జూన్-జులై నాటికి మొదటి విడతలో మంజూరైన మూడు లక్షల ఇళ్లలో మెజారిటీ పూర్తి అవుతాయి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి వీలైంత దగ్గరలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రుపొందిస్తున్నాం. గతంలో దూర ప్రాంతాల్లో నిర్మించిన 2BHK ఇళ్లను లబ్ధిదారులు ఉపయోగించలేకపోయిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా, 2BHK పథకంలో పెండింగ్ బిల్లులలో 99% ఇప్పటికే చెల్లించామని, మిగిలినవాటిని కూడా త్వరలో క్లియర్ చేస్తాం. వివిధ దశల్లో ఆగిపోయిన 2BHK ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.