- రూ. 1650 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్
నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1650 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 2 ఎకరాలు పార్కు కోసం కేటాయించినది కాగా.., 5 ఎకరాలు స్మశాన వాటికతో పాటు 4 ఎకరాల డంప్ యార్దుకు చెందినది ఉంది. రంగరెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్లోని సెంట్రల్ పార్కు కాలనీలో పార్కు కోసం 2 ఎకరాలు కేటాయించారు. సర్వే నంబరు 110/1 లో 148 ప్లాట్లతో 16 ఎకరాల మేర సెంట్రల్ పార్కు కాలనీ ఫేజ్-1 పేరుతో 1998లో లే ఔట్ వేశారు. ఇందులో 2 ఎకరాలను పార్కు కోసం కేటాయించగా.. మున్సిపల్ అధికారులు పార్కు స్థలంగా హద్దులు నిర్ధారించి ప్రహరీ కూడా నిర్మించారు. ఇలా పార్కు కోసం కేటాయించిన భూమి తమదంటూ కొంతమంది ఆక్రమణలకు పాల్పడడం.. కాలనీవాళ్లు అడ్డుకుంటే వారిని బెదిరించడం వంటి ఘటనలు పలుమార్లు జరిగాయి. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలసి హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. 2 ఎకరాల పార్కు స్థలంగా నిర్ధారించింది. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం పార్కులో తాత్కలికంగా వేసిన షెడ్డులను తొలగించింది. 2 ఎకరాల పార్కు స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
ప్రగతినగర్లో 9 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్ష..
ప్రగతినగర్లోని అంబీర్ చెరువుకు ఆనుకుని ఉన్న 5 ఎకరాల స్మశానవాటికతో పాటు.. ఆ పక్కనే ఉన్న 4 ఎకరాల డంపింగ్ యార్డు ఆక్రమణలకు గురౌతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో విచారించింది. కూకట్పల్లి మండలంలోని బాగామేరి విలేజ్ సర్వే నంబరు 103లో ఉన్న ఈ భూమిని స్మశానవాటికకు, చెత్త డంపింగ్ యార్డుకు కేటాయించిందిగా నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు 9 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. 5 ఎకరాలలో స్మశాన వాటిక స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఆ పక్కనే ఉన్న 4 ఎకరాల్లో ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రగతి నగర్ చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిని కబ్జాల పాలవ్వకుండా కాపాడిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఫిర్యాదులు అధికారులకు అందజేశామని.. హైడ్రా ఎంట్రీతో ఈ సమస్య పరిష్కారం అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు.