ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్: మంత్రి దామోదర్ రాజనర్సింహ

  • వారం రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు
  • ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం
  • ఈ నెల 6న ఉదయం నెక్లెస్‌ రోడ్డులో ఈట్‌ రైట్ వాక్
  • అదేరోజు మధ్యాహ్నం నేచురోపతిలో మిల్లెట్ మేళా
  • ఈ నెల 7న 871 మంది డాక్టర్లకు నియామక పత్రాలు
  • అదే రోజు కేన్సర్ రిజిస్ట్రీ ప్రారంభించనున్న మంత్రి
  • నిమ్స్‌లో అందుబాటులోకి రానున్న LINAC సేవలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకూ హెల్త్ వీక్ నిర్వహించనున్నారు. హెల్త్ వీక్‌లో రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో శనివారం మంత్రి దామోదర్ రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హెల్త్ వీక్‌లో చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేలా, ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు ఉండాలని మంత్రి సూచించారు. హెల్త్ వీక్‌లో ప్రతి రోజు ప్రత్యేక థీమ్‌తో నిర్వహించే కార్యక్రమాల వివరాలను సమీక్షించిన మంత్రి, అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. హెల్త్ వీక్‌లో భాగంగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ విద్యార్థులు, మహిళలు, యువతను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. ఆహార నాణ్యత ప్రాముఖ్యతను తెలిపేలా ఏప్రిల్ 6న ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద ఈట్ రైట్ వాక్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.00 నుంచి నేచురోపతి హాస్పిటల్‌లో 40 స్టాళ్లతో మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ఇదే కార్యక్రమంలో ఫుడ్ హ్యాండ్లర్లకు శిక్షణ, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు సర్టిఫికేట్ల పంపిణీ, హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ల పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాల్లో కూడా ఉదయం ఈట్ రైట్ వాక్‌లు, మధ్యాహ్నం ఫుడ్ రిజిస్ట్రేషన్ మేళాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. కేన్సర్ పేషెంట్లకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిమ్స్‌లో ఏర్పాటు చేసిన అధునాతన LINAC యంత్రాన్ని ఉదయం 10 గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఇందులో తెలంగాణ కేన్సర్ రిజిస్ట్రీ ప్రారంభం, ట్రామా కేర్ పాలసీ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పోర్టల్, PC&PNDT, ART సరోగసీ పోర్టల్స్ ప్రారంభం, అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపికైన 871 మంది డాక్టర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం, ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధికి దోహదపడేలా సమర్థంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.

ఏప్రిల్ 8న సేఫ్ మదర్ డేగా నిర్వహిస్తూ ఉదయం 11.00 గంటలకు బోయిగూడలోని మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాల్లో ANC పరీక్షలు, హైరిస్క్ కేసుల గుర్తింపు, ప్రసూతి సేవలపై వర్క్‌షాప్‌ల నిర్వాహణ, గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్‌లో రెడ్ రన్ నిర్వహించనున్నారు. జిల్లాల్లో కూడా ఇదే సమయానికి అవగాహన ర్యాలీలు నిర్వహించాలని మంత్రి సూచించారు. జైళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు, ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్‌లో వైద్య సేవలు, ఉచిత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఏప్రిల్ 10న హోమియోపతి, ఆయుష్ డేగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. ఉదయం 11.00 గంటలకు హోమియోపతి కళాశాలలో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించనున్నారు. జిల్లాల్లో యోగా ప్రదర్శనలు, వైద్య శిబిరాలు విస్తృతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు.

ఏప్రిల్ 11న డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెంథెనింగ్ డేగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 11న మెడిసిన్ సేఫ్టీ, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి గాంధీ హాస్పిటల్‌ డీ అడిక్షన్ ట్రీట్మెంట్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవింద్ర నాయక్ , వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.