రైల్వే పెండింగ్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: సిఎస్ కె. రామకృష్ణా రావు

హైదరాబాద్ : రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అన్నారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు సంబందించిన అపరిష్కృత అంశాలపై సి.ఎస్ నేడు సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, జయేష్ రంజన్, నవీన్ మిట్టల్, టి.జి.ఆర్.టి.సి ఎండీ నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి కర్ణన్, జలమండలి ఎం.డి అశోక్ రెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్ సృజన, దక్షిణ మండలం విధ్యుత్ సరఫరా సంస్థ ఎండి జితేష్ పాటిల్ , మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి తదితర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే అండర్ బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రజా రవాణా మరింత మెరుగు పరచడం తదితర దాదాపు 21 అంశాలపై సమీక్షించారు. ఈ పెండింగ్ అంశాలకు సంబంధించి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ప్రధానంగా మున్సిపల్, జలమండలి, రెవిన్యూ, విధ్యుత్, రోడ్లు భవనాల శాఖల అధికారులు సంయుక్త తనిఖీలను నిర్వహించి తగు పరిష్కార మార్గాలను చేపట్టాలని సి.ఎస్ ఆదేశించారు. ఈ రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశాలపై త్వరలోనే రైల్వే ఉన్నతాధికారులతో సమావేశముందని, ఈ లోపు ప్రతీ పెండింగ్ అంశానికి తగు నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు.