రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయ వర్సిటీ అసోసియేట్‌ డీన్‌ గోవర్ధన్‌

రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ డీన్‌ గోవర్ధన్‌ ఏసీబీ వలకు చిక్కారు. ఒక విత్తన కంపెనీకి లైసెన్సు మంజూరు చే సేందుకుగాను ఆయన లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లైసెన్స్‌కు సంబంధించి ఇంతకు ముందు తొలి విడత రూ.25వేల లంచం తీసుకున్న గోవర్ధన్‌ తర్వాత మరో రూ.లక్ష కావాలని డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. గోవర్ధన్‌కు బాధితుడు డబ్బు ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా మంగళవారం పట్టుకున్నారు. అనంతరం ఎల్‌బీనగర్‌లోని గోవర్ధన్‌ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోవర్ధన్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కి కాల్‌ చేయాలని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ చారుసిన్హా తెలిపారు.