ఏపీ- తెలంగాణ ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ రాష్ట్రాలకు ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1991 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీసె్‌సకు చెందిన అధికారి. ఈయనకు కార్పొరేట్‌, వ్యాపార మదింపులు, ఆర్థిక దర్యాప్తులు, ట్యాక్స్‌ డిడక్షన్‌, అంతర్జాతీయ పన్నులకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలను నిర్వహించడంలో అనుభవం ఉంది. అలాగే మానవ వనరులు, ఆర్థికం, సమాచార సాంకేతికత, వ్యాపార విశ్లేషణ వంటి ఉన్నతస్థాయి నిర్వహణ విధుల్లోనూ పరిపాలన అనుభవం ఉంది. 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్‌ ప్రధాన ఆదాయ పన్ను కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఏపీకి సంబంధించిన ఆదాయ పన్ను వ్యవహారాలను కూడా పర్యవేక్షించారని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫ్‌ బ్యూరో (పీఐబీ) ఒక ప్రకటనలో పేర్కొంది.