తెలంగాణ‌లో ఎయిర్‌పోర్ట్ ప‌నులు వేగ‌వంతం చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని స‌మ‌గ్ర అభివృద్ది దిశ‌గా ముందుకు తీసుకువెళ్లాల‌నే ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. ఈ క్ర‌మంలో వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ‌ను సిద్దం చేసింద‌ని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ల నిర్మాణం వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించేందుకు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ‌, సాంకేతిక అనుమ‌తులు, మౌలిక వ‌స‌తుల ఏర్పాటుకు చ‌ర్య‌లు వేగవంతం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. శ‌నివారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో ఎయిర్‌పోర్ట్ అధారిటీ స‌ద‌ర‌న్ రీజియ‌న్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ రాజ్ కిషోర్‌, ఏవియేష‌న్ డైరెక్ట‌ర్ భ‌ర‌త్‌రెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి వ‌రంగ‌ల్ , ఆదిలాబాద్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మించ‌త‌ల‌పెట్టిన ఎయిర్ పోర్ట్‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర‌ప్ర‌భుత్వంతో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన ముందుకు తీసుకువెళ్లాల‌ని సూచించారు. వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్‌కు సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించింద‌ని తెలిపారు. వీలైనంత త్వ‌ర‌లో శంకుస్ధాప‌న చేస్తామ‌ని వెల్ల‌డించారు. అలాగే ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని డిఫెన్స్ (రక్షణ శాఖ) మరియు సివిల్ ఏవియేషన్ (పౌర విమానయాన శాఖ) , తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయ‌ని ఇందుకు సంబంధించి మాస్ట‌ర్ ప్లాన్ త‌క్ష‌ణ‌మే సిద్దం చేయాల‌ని సూచించారు. ఈ ఎయిర్ పోర్ట్‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తెలిపారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయ‌న్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపిన నేప‌ధ్యంలో దీనిపై మ‌రింత లోతైన అధ్య‌య‌నం చేసి సాధ్యాసాధ్యాల‌పై ఒక నివేదిక రూపొందించాల‌ని సూచించారు.