ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన క్రీడా దినోత్సవం

హైదరాబాద్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాలు” కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా “క్రీడా దినోత్సవం”ను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు మరియు అధికార యంత్రాంగం పర్యవేక్షణలో జిల్లా యువజన మరియు క్రీడాశాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు విజయవంతంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి ప్రధాన ఉత్సవాలు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడగా, యువత, క్రీడాకారులు, తల్లిదండ్రులు మరియు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జంట నగరాల్లోని గచ్చిబౌలి జీఎంసీబీ స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్, సైక్లింగ్ వెలోడ్రోమ్ తదితర క్రీడా వేదికల్లో ఇంటర్ స్టేడియా కాంపిటీషన్స్ నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫెన్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, ఫుట్‌బాల్, చెస్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, రెజ్లింగ్ తదితర క్రీడాంశాల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనీ బాలాదేవి ఈ పోటీలను స్వయంగా పర్యవేక్షించారు. ఆమె వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొంటున్న క్రీడాకారులను కలుసుకుని ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. యువతతో పాటు క్రీడాకారులు, తల్లిదండ్రులు మరియు సమాజంలోని వివిధ వర్గాల ప్రజల నుండి ఈ కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారు, అన్ని వయస్సుల వారు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకునేలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొనే అవకాశాలను కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు రవితేజ, సుజాత, శ్రీనివాస్, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు రవికుమార్, రాజ్‌వీర్, నందకిషోర్, కన్నం మధు, పీఆర్‌వో కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.