చౌడు నేలల పునరుద్ధరణకు జిప్సం వినియోగం

  • 90% సబ్సిడీపై రైతులకు జిప్సం సరఫరా
  • సమస్యాత్మక నేలలకు జిప్సం ఉత్తమ పరిష్కారం
  • వేరుశనగ, వరి పంటల్లో అధిక దిగుబడులకు జిప్సం దోహదం
  • కేవలం ₹534 రైతు వాటాతో టన్ను జిప్సం

భూసారాన్ని మెరుగుపరచడం, ఉప్పు ప్రభావిత (చౌడు) నేలలను సాగుకు అనుకూలంగా మార్చడం, వేరుశనగ, వరి వంటి పంటల్లో అధిక దిగుబడులు సాధించడం కోసం రైతులు జిప్సం వినియోగాన్ని పెంచాలని వ్యవసాయ శాఖ సంచాలకులు బి. గోపి, ఐఏఎస్ సూచించారు. రాష్ట్రంలో సాగునీటి విస్తరణ, అసమతుల్య ఎరువుల వాడకం, సరైన నీటి నిర్వహణ లేకపోవడం వంటి కారణాల వల్ల అనేక ప్రాంతాల్లో నేలల ఉప్పుదనం (చౌడు), క్షారత్వం పెరుగుతున్నదన్నారు. సాధారణంగా పీహెచ్‌ 8.2 కంటే ఎక్కువగా ఉన్న నేలలను క్షార నేలలుగా పరిగణిస్తారని తెలిపారు. ఇటువంటి నేలల్లో మొక్కలు నీరు, పోషకాలను సమర్థవంతంగా గ్రహించలేక దిగుబడులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. సమస్యాత్మక (చౌడు) నేలల పునరుద్ధరణకు జిప్సం వాడకం జిప్సం (కాల్షియం సల్ఫేట్‌)లో సుమారు 23–24 శాతం కాల్షియం, 18 శాతం గంధకం ఉండి ఇవి పంటలకు అత్యవసర ద్వితీయ పోషకాలుగా పనిచేస్తాయని వివరించారు. జిప్సం నేలలోని సోడియం అయాన్లను కాల్షియంతో మార్పిడి చేసి నేల గట్టిపడకుండా గుల్లగా మారుస్తుందని, దీని వల్ల నీరు భూమిలో లోతుగా ఇంకి వేర్ల పెరుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. అలాగే నేలలోని ఉప్పుదనం తగ్గి పంటల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు.

వేరుశనగ పంటలో జిప్సం ప్రాధాన్యత
వేరుశనగ పంటలో జిప్సం వినియోగం అత్యంత ప్రయోజనకరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని తెలిపారు. వేరుశనగ కాయలు నిండుగా ఏర్పడటం, గింజలు గట్టిపడటం, నూనె శాతం పెరగడం, తాలుకాయలు తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. కాల్షియం లోపం ఉన్నప్పుడు ఆకులు ముడుచుకోవడం, వేర్ల పెరుగుదల తగ్గడం, పూతలు రాలిపోవడం, కాయల అభివృద్ధి మందగించడం జరుగుతుందని, గంధకం లోపంతో ఆకులు పసుపు రంగులోకి మారి మొక్క ఎదుగుదల తగ్గుతుందని వివరించారు. రైతులు వేరుశనగ పంటలో ఎకరాకు 200 కిలోల జిప్సంను తొలి పూత దశలో లేదా విత్తిన 45 రోజుల సమయంలో కలుపు తీసేటప్పుడు మొక్కల మొదళ్ల వద్ద వేయాలని సూచించారు. జిప్సం వేసిన అనంతరం మట్టిని మొక్కల వద్దకు ఎగదోయడం ద్వారా ఊడలు, కాయలు కాల్షియంను నేరుగా గ్రహించి దిగుబడి, నాణ్యత పెరుగుతాయని తెలిపారు.
వరి పంటలో జిప్సం వినియోగంపై సూచనలు
అధిక సోడియం, అధిక పీహెచ్‌ ఉన్న చౌడు నేలల్లో వరి సాగుకు ముందు జిప్సం వినియోగం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ముఖ్యంగా గట్టి నేలలు, పగుళ్లు ఏర్పడే నల్లరేగడి నేలలు, నీరు నిల్వ ఉండే భూముల్లో జిప్సం వాడటం ద్వారా నేల నిర్మాణం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వరి సాగులో ఎకరాకు 100–200 కిలోల జిప్సంను చివరి దుక్కి సమయంలో సమానంగా చల్లి నేలలో 5–10 సెంటీమీటర్ల లోతు వరకు కలియదున్నాలని సూచించారు. అనంతరం మంచి నీటితో పొలాన్ని తడపడం ద్వారా నేలలోని అదనపు సోడియం బయటకు వెళ్లిపోతుందని తెలిపారు. డ్రై సీడెడ్ రైస్‌ (DSR) పద్ధతిలో సాగు చేసే రైతులు భూమి సిద్ధం సమయంలోనే జిప్సంను ప్రాథమిక మోతాదుగా వినియోగించవచ్చని పేర్కొన్నారు.
జిప్సం వాడకం వల్ల వరి పంటలో నీటి ఇంకుడు సామర్థ్యం పెరగడం, వేర్ల పెరుగుదల మెరుగుపడడం, గింజ నింపుదల బాగుండడం, అధిక దిగుబడులు రావడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. అలాగే నేలలో గాలి ప్రసరణ మెరుగై, నీరు నిల్వ సమస్య తగ్గుతుందని వివరించారు.

జిప్సం వాడకం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు

  • చౌడు నేలల్లో సోడియం ప్రభావం తగ్గుతుంది ,నేల గట్టిపడకుండా గుల్లగా మారుతుంది, నీటి ఇంకుడు సామర్థ్యం పెరుగుతుంది, నేలలో గాలి ప్రసరణ మెరుగుపడుతుంది, కాల్షియం, గంధకం లభ్యత పెరుగుతుంది, నూనెగింజల పంటల్లో నూనె శాతం పెరుగుతుంది సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయి.
    వరి పంటలో నీరు నిల్వ సమస్య తగ్గుతుంది, భూగర్భ జలాల నిల్వకు దోహదపడుతుంది
  • అధిక సోడియం ఉన్న నేలల్లో జిప్సం వినియోగం ద్వారా నేల నిర్మాణం మెరుగుపడి సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. నేల పరీక్షల ఆధారంగా తగిన మోతాదులో మాత్రమే జిప్సం వినియోగించాలని రైతులకు సూచించారు.
    90% సబ్సిడీతో జిప్సం అందుబాటులో
    రాష్ట్రంలో ఆర్‌కేవీవై (RKVY) – సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ కార్యక్రమం కింద చౌడు నేలల పునరుద్ధరణ కోసం రైతులకు జిప్సం 90 శాతం సబ్సిడీపై అందజేయబడుతోందని తెలిపారు. ఒక టన్ను జిప్సం పూర్తి ధర ₹5,340 కాగా, ఇందులో 90 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందని, రైతు వాటాగా కేవలం ₹534 ప్రతి టన్నుకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 11,500 మెట్రిక్ టన్నుల జిప్సం పంపిణీకి ప్రణాళిక రూపొందించగా, ఇప్పటివరకు 4,500 మెట్రిక్ టన్నుల జిప్సంను రైతులకు పంపిణీ చేయడం జరిగింది”
    ఈ పథకం ద్వారా చౌడు నేలలను పునరుద్ధరించి భూసారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతులు తమ భూములకు మట్టి పరీక్షలు చేయించుకొని, అవసరమైన మేరకు జిప్సంను వినియోగించి ప్రభుత్వ సబ్సిడీ సదుపాయాన్ని పొందాలని సూచించారు.
    మరిన్ని వివరాల కోసం రైతులు తమ సమీప వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), మండల వ్యవసాయ అధికారి (MAO), వ్యవసాయ శాఖ కార్యాలయాలు లేదా రైతు వేదికలను సంప్రదించవచ్చని వ్యవసాయ శాఖ సంచాలకులు బి. గోపి, ఐఏఎస్ పేర్కొన్నారు.